తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సమ్మక్క, సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకుంటారు. రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని అన్నారు. పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు సాగే యాత్రలో తాను పాల్గొంటున్నట్లు చెప్పారు సీతక్క.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మేడారం గుడి నుంచి పాదయాత్రకు బయలుదేరతారు. తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్ గ్రామాల మీదుగా గోవిందరావు పేట మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామానికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకుంటుందని సీతక్క తెలిపారు. అదే రోజు 2 నుంచి 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్ లోనే భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్ నుంచి బయలుదేరి పాదయాత్ర సాయంత్రం 4.30 గంటల వరకు పస్రా గ్రామానికి చేరుకుంటుంది. 4.30 నుంచి 5 గంటల వరకు టీ విరామం ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు పస్రా జంక్షన్ లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు పస్రా గ్రామం నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్ మీదుగా వెంకటాపూర్ మండలంలోని జవహర్నగర్, జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్రోడ్ మీదుగా పాలంపేటకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 7న ఉదయం 8 గంటలకు పాలంపేట రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పాలంపేట గ్రామం నుంచి బయలుదేరి రామంజపురం, చెంచుకాలనీ, నారాయణగిరిపల్లె మీదుగా బుద్దారం గ్రామానికి మధ్యాహ్నం 1.30 వరకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి బుద్దారం గ్రామం నుంచి కేశవాపూర్, నర్సాపూర్, బండారు పల్లి మీదుగా సాయంత్రం 6 గంటల వరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుందని సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతోపాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు.