గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అక్రమ కట్టడాలకు సంబంధించి ఆధారాలను లేఖకు జత చేశారు. టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని అందులో వివరించారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవన్నారు రేవంత్. గులాబీ నేతల అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ను ప్రశ్నించారు. వారి చర్యలను ఎందుకు అడ్డుకోరని అడిగారు. ఇదంతా మీకు చేతకాకనా.. లేక అందులో వాటాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు.
జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పారు రేవంత్. అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారని.. ఇది అంత ఆషామాషీ విషయమా? అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫిర్జాదీగూడలో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారన్నారు.
దేవరయాంజల్ 437 సర్వే నెంబర్ లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి పత్రికలు నడుపుతున్నారని కేటీఆర్ కు గుర్తు చేశారు రేవంత్. ఇలా గ్రేటర్ లో గులాబీ నేతల కబ్జాలు కోకొల్లలని వివరించారు. అనేక అక్రమాలకు సంబంధించి పత్రికలలో పతాక శీర్షికలు వచ్చాయన్న ఆయన.. మున్సిపల్ శాఖ మంత్రిగా స్పందించి చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించాలని కోరారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన తామే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు రేవంత్.