హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు జరగనున్నాయి. హుస్సేన్ సాగర్ వేదికగా ఈ అంతర్జాతీయ ఈవెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ఆదివారం నుంచి మొదలైన ఆంక్షలు ఈ నెల 12వ తేదీ వరకు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల రేస్ కోసం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
అయితే పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలపై నగర వాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ మళ్లింపుల వల్ల నరకయాతన పడుతున్నామని మండిపడుతున్నారు. మంగళవారం ఎన్టీఆర్ మార్గ్ లో వాహనదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కార్ రేస్ కోసం ఏర్పాటు చేసి రోడ్డు, నలుమూలలా మూసివేస్తే ఏ వైపు నుండి వెళ్ళాలో తెలియక ఇబ్బంది అవుతుందని, వారాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే.. నగరం చుట్టూరా తిరగాల్సి వస్తుందని మండిపడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఉండగా, పోలీసులు ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు. ఈ ఆంక్షల కారణంగా తమకి పెట్రోల్, డీజిల్ కే జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు.
కాగా ట్రాఫిక్ ఆంక్షల ప్రభావంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్, రవీంద్రభారతి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్ రూట్ లలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.