దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ ముగింపు రోజున బంగాల్ లోని జల్పాయ్ గుడిలో పెను విషాదం చోటు చేసుకుంది. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం నదిలోకి దిగిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరికొంతమంది గల్లంతయ్యారు. ఈ ఘటన మాల్బజార్ ప్రాంతంలో జరిగింది. ఇప్పటివరకు భక్తిశ్రద్ధలతో పూజించిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వందలాది మంది స్థానికులు అనేక మందికి మాల్ నదికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని.. విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు.
ఇంతలోనే ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీవిని ముంచెత్తింది. అనేక మంది నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు.
వరద ఉద్ధృతి మధ్య దీవిపై అలానే బిక్కుబిక్కుమంటూ నిల్చున్న దాదాపు 40 మందిని రక్షించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.