ట్రాఫిక్ పోలీసులు వాహనం లాక్కున్నారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 15 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉండడంతో పోలీసులు వాహనాన్ని అదుపులోనికి తీసుకోడాన్ని అవమానంగా భావించిన వ్యక్తి ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చికిత్సపొందుతూనే మరణించాడు.
ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడిని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ మెన్గా పని చేస్తున్నారు.
ఈనెల 21న రాత్రి పని ముగించుకుని గ్రామానికి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వరంగల్లో ట్రాఫిక్ ఎస్సైతో పాటు సిబ్బంది ఆపి ఆ వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించారు. 15 చలాన్లు ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని స్టేషన్కు తరలించారు.
తర్వాత చెల్లిస్తానని మొగిలి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.బాధితుడు రాత్రిపూట నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. మనస్తాపానికి గురై మరుసటి రోజు ఉదయం గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు గుర్తించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ట్రాఫిక్ పోలీసుల కారణంగానే మొగిలి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇందుకు కారణమైన ట్రాఫిక్ ఎస్సైతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.