కేరళా కేపిటల్ తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓశిక్షణా విమానం పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాద ఘటనలో పైలట్ ప్రాణాలతో బైటపడ్డాడు. అప్పటి దాకా అతని చేతుల్లో రయ్యిమని దూసుకెళ్ళిన విమానం రన్వేకు సమీపంలో తలకిందులుగా పడింది.
ఒక్కరు మాత్రమే ప్రయాణించే సెస్నా172ఆర్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ రన్వే నుంచి టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే ఆ చోటావిమానం రన్వే పై పల్టీలు కొట్టింది. కాగా, దీనిని గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం పడిన ప్రాంతానికి వెళ్లారు. ఆ ఫ్లైట్కు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అందులోని పైలట్ను సేఫ్గా బయటకు తీశారు. 34 ఏళ్ల అనూప్ నాయర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో గంట వరకు విమాన సేవలను నిలిపివేశారు.
అలాగే మూడు కమర్షియల్ ఫ్లైట్లు ఆలస్యమైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి డీజీసీఏకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా, శిక్షణ విమానం తలకిందులుగా పడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.