రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10 : 03 గంటలకు 15,062 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇక సోమవారం నాడు 14,138 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది.
రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోందని ప్రభాకర్రావు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువైందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు.
గత సంవత్సరం మార్చి నెలలో అత్యధికంగా 14,160 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని సీఎండీ తెలిపారు. గత డిసెంబర్లో ఈ రికార్డును అధిగమిస్తూ 14,750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం జరిగిందన్నారు. కాగా తాజాగా మంగళవారం 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగమైందని చెప్పారు. మార్చి నెలలో 15వేల మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ముందే ఊహించామని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
అందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగా వాట్లకు పైగా డిమాండ్ ఏర్పడవచ్చని అంచనా వేశారు. ఎంత డిమాండ్ వచ్చినా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.