బంగారు తెలంగాణలో మనిషి చనిపోతే కాల్చేందుకు స్థలం లేదు. నమ్మశక్యంగా లేదా..? ఉదయం నుంచి ఓ కుటుంబం పడుతున్న కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పెద్దగుట్ట తండాలో బద్రు నాయక్ అనే గిరిజన వ్యక్తి చనిపోయాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. గతంలో స్థానికంగా ఉన్న మూడు తండాలకు సంబంధించి అధికారులు ఓ దగ్గర 5 గుంటల భూమిని కేటాయించారు. బద్రు నాయక్ శవాన్ని అక్కడకు తీసుకెళ్లగా.. స్థానిక తండా వాసులు అడ్డుకున్నారు.
చేసేదిలేక.. ట్రాక్టర్ లో కట్టెలతో మరో ప్రాంతానికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అలా మూడు స్థలాలు తిరిగినా అంత్యక్రియలకు ఒప్పుకోని పరిస్థితి. దీంతో ఎంత కష్టమొచ్చింది దేవుడా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు జాగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.