సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని తొగుట మండలం గుడికందుల గ్రామంలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. కేంద్రం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయికి అడ్డతిరిగారు.
ఎమ్మెల్యే వస్తున్నట్టు తెలిసిన ముందస్తు సమాచారంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.
గ్రామంలో నిర్మించిన యాభై డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు.. పార్టీ కార్యకర్తలతో కలిసి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు.
స్టేషన్ లో బైఠాయించి సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తనను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా తమ పరిధిలోకి వస్తే తనకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. టీఆర్ఎస్ గూండాలకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు రఘునందన్ రావు.