సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. తహశీల్ధార్ ఆఫీస్ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
తమ కృషి వల్లే భూంపల్లి అర్బర్ పేట్ మండలం ఏర్పాటు అయిందని.. రెండు పార్టీల కార్యకర్తల నినాదాలు ఇచ్చారు. రఘునందన్ రావు కృషితోనే తహశీల్ధార్ ఆఫీసు నిర్మాణం అయిందంటూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తహశీల్ధార్ ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
అంతకుముందు భూంపల్లి, అక్బర్ పేట్ కొత్త మండలాలుగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. కుక్కనూర్ పల్లి, నిజాంపేట్, భూంపల్లిలను కొత్త మండలంగా కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడగగానే అనుమతి ఇచ్చారని చెప్పారు. ఉచిత విద్యుత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నందుకు కేంద్రం ఓర్వలేకపోతుందని, అందుకే నిధులు ఆపేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి హరీష్ రావు.
అనంతరం బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే బాధ ప్రజల్లో ఉందని… ఒక దరిద్రుడు ఇక్కడ ఎమ్మెల్యే కావడమే దురదృష్టమని మండిపడ్డారు. తన వల్లే భుంపల్లి మండలం వచ్చిందని సిగ్గు, శరం లేకుండా రఘునందన్ రావు చెప్పుకుంటున్నారని విమర్శించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.