తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఇదే వల్లె వేస్తుంటారు. అయితే, కొందరు నేతలు చేసే పని ఆపార్టీని అప్రతిష్టపాలు చేస్తోంది. తాజాగా వరంగల్ లో గులాబీ లీడర్ రాజనాల శ్రీహరి చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
జాతీయ పార్టీ కోసం సీఎం కేసీఆర్ తెగ కసరత్తు చేస్తున్నారు. దసరా రోజున అనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కాస్త అత్యుత్సాహం చూపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తూ కోళ్లు, మద్యం పంపిణీ చేశారు.
అంతేకాదు.. జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు కావాలని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించాలని అన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని.. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కేటీఆర్ ఎంపిక అయి.. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని పూజల అనంతరం.. వరంగల్ చౌరస్తాలో 200 మంది హమాలీలకు ఒక కోడితోపాటు మద్యం బాటిల్ పంపిణీ చేశారు. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.