గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ, తమిళనాడు, కేరళ సహా ప్రతిపక్ష పార్టీలు ఉన్న అనేక రాష్ట్రాల్లో.. గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని కేశవరావు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి వస్తోందని ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని గుర్తు చేశారు.
సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం గురించి చర్చ జరగాలని ఆయన చెప్పారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయనందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని కేశవరావు వెల్లడించారు.
అసెంబ్లీలో ప్రసంగం గురించి గవర్నర్ కు అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేశవరావు.