మునుగోడు బై ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికకు 86 మంది ఇన్ చార్జ్ లను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ మొదలు పెట్టింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా మొత్తం 86 మంది పార్టీ నేతలను ఇన్ చార్జ్ లుగా ప్రకటించింది. దీనికి సంబంధించి లిస్ట్ ను కూడా విడుదల చేసింది. మునుగోడు మండలానికి 13 మందిని, నాంపల్లి మండలానికి 11 మందిని, నారాయణపూర్ మండలానికి 13 మందిని, చుండూరు మున్సిపాలిటీకి ఐదుగురిని, చుండూరు మండలానికి 11 మందిని, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 10 మందిని, చౌటుప్పల్ మండలానికి 12 మందిని, మర్రిగూడ మండలానికి 11 మందిని ఇన్ చార్జ్ లుగా నియమించింది.
ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్ లు చుండూరు మున్సిపాలిటీకి టీఆర్ఎస్ ఇన్ చార్జ్ లుగా ఉన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే చింతం ప్రభాకర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఇన్ చార్జ్ లుగా ఉన్నారు.
మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జీలుగా నియమితులైన వారంతా దసరా పండుగ తర్వాత వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే మునుగోడు బై పోల్ బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఎన్నికల ప్రచారం ముగిసే దాకా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే
20 మంది అనుచరులతో కలిసి గ్రామాలకు వెళ్లాలన్నారు.
ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు అందజేస్తామని, వారి ఇండ్లకు వెళ్లి టీఆర్ఎస్కు ఓటు వేసేలా వారిని ఒప్పించాలన్నారు. ఈ నెల నాలుగో వారంలో తాను ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ చార్జీలు ప్రచారం చేయాలని.. కేటీఆర్, హరీశ్ రావు ఎప్పటికప్పుడు ప్రచార సరళిని పర్యవేక్షిస్తారని చెప్పారు సీఎం కేసీఆర్.