తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతలకు ఆదరణ కరువైందని అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర నేపథ్యంలో శుక్రవారం స్వామి వారికి ప్రవీణ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజనులు ఎక్కువగా ఆదరించే గ్రామ దేవతల ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదనన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలోనూ దళితురాలైన రాణి కుముదినికి అన్యాయం చేసిందన్నారు.
ఈ వివక్ష అంతమొందాలంటే రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికారం అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరతాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.