ఇంటర్మీడియట్ బోర్డుపై బోర్డు సెక్రెటరీ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమీషనర్ వ్యవస్థ నడుస్తోందని ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. బోర్డు కార్యాలయంలోని సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారన్నారు. నేను ఒక అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల పాస్ వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి రన్ చేస్తున్నాడు. మాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా డబ్బులు సంపాదించే వారే ఆన్ లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇంటర్ బోర్డులో డాటా చోరి అయింది.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు తదితర క్రిమినల్ కేసుల కారణంగా సస్పెండైన ఓ జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. సంబంధం, అర్హత లేని వ్యక్తి బోర్డు వాల్యుయేషన్ సిస్టంపై అనుమానాలు, అపోహలు సృష్టించారని ఆరోపించారు. ఆన్ లైన్ విధానం ద్వారా ఇంట్లో నుంచే వాల్యుయేషన్ చేయవచ్చని అన్నారు.
ఈ విధానం వల్ల ఖర్చు, పనిభారం పూర్తిగా తగ్గడంతో పాటు అక్యురేట్ గా వాల్యుయేషన్ చేయవచ్చని నవీన్ మిట్టల్ తెలిపారు. నూతన విధానం వల్ల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చని అన్నారు. ఎగ్జామినేషన్ ప్రక్రియను కంట్రోల్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు తమ చేతుల నుంచి ఆ వ్యవస్థ చేజారి పోతుందనే భయంతో బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని నవీన్ మిట్టల్ ఆరోపించారు. ఈ ఏడాది ఆర్ట్స్, కామర్స్ పేపర్లు మాత్రమే ఆన్ లైన్ ద్వారా వాల్యుయేషన్ చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో తప్పుడు ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలకు బిడ్డింగ్ కు అనుమతి ఇవ్వడం లేదని.. ఇప్పడికే ఓయూ, అంబేద్కర్ వర్సిటీలు ఆన్ లైన్ ద్వారా స్పాట్ వాల్యుయేషన్ చేయగా ఎలాంటి సమస్య తలెత్తలేదని అన్నారు. కొంతమంది ఇంటర్ బోర్డును ఆదాయవనరుగా మార్చుకున్నారని విమర్శించారు. బోర్డుపై ఒకవ్యక్తి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పేపర్ వాల్యువేషన్ పై ఎలాంటి గందరగోళం లేదని.. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నవీన్ మిట్టల్ భరోసా ఇచ్చారు.