తెలంగాణలోని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిరసనకు దిగారు జనసేన నేతలు. ఏపీలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
అయితే ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపు ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలా? లేక ప్రజా రక్షకులా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కోసం తెగ ఆరాటపడుతున్న అధికార పార్టీ.. గడిచిన మూడున్నరేళ్లు ఏం చేసిందని నిలదీశారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే కొత్త డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా.. పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అండగా ఉంటామని స్పష్టం చేశారు శంకర్ గౌడ్.
విశాఖలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జన వాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. శనివారం విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజా, వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ కార్లపై జనసేన సైనికులు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయిన జన సైనికులను విడుదల చేసే వరకూ.. జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్న పవన్ వెల్లడించారు.