ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదంటూ చెప్పుకొచ్చారు. ఖమ్మం సభను చూసిన తర్వాత అయినా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపిన కేసీఆర్.. దేశాన్ని కూడా అదే తీరులో నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు.
దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ ను కాపాడుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు.
తెలంగాణ కంటే బీజేపీ పాలితరాష్ట్రాలు బాగుంటే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ విసిరారు. బీజేపీ పాలించే రాష్ట్రాలకు వెళ్ళి చూద్దామంటే ఆ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.