తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవనం నుంచి నేరుగా మంత్రి గంగుల, ఎంపీ రవి చంద్ర సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఇద్దరూ విచారణకు రావాలని బుధవారం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు ఇద్దరు నేతలు. అనంతరం తెలంగాణ భవన్ లో న్యాయవాదులతో చర్చించి.. సీబీఐ ఆఫీసుకు వెళ్లారు.
నకిలీ సీబీఐ అధికారి కొమిరెడ్డి శ్రీనివాస్ కేసులో ఈ విచారణ జరుగుతోంది. శ్రీనివాస్తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రల వాగ్మూలం రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్ లను ప్రలోభ పెట్టినట్లు సీబీఐ గుర్తించింది.
కాగా ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు బుధవారం సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా.. అక్కడ గంగుల లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అధికారులు వివరాలు సేకరించారు. గురువారం ఢిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు.
అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి.. మంత్రి గంగులతో టచ్ లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. నకిలీ సీబీఐ శ్రీనివాస్ ఏయే వివరాలు అడిగారనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం ఈడీ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు.