సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో బుధవారం తెలంగాణ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పుల్లూరులో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాభి శిల బొడ్రాయి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. పుల్లూరు గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ దేవాలయం కల నిజమైంది. గ్రామ ప్రజలందరికీ ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు. గ్రామాన్ని అనేక రకాలుగా అన్నీ రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు మంత్రి హరీష్. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవనీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని మంత్రి చెప్పారు.
పుల్లూరు గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు-బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందని, రానున్న వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు ప్రారంభం చేసుకుందామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.