హైదరాబాద్ నగరంలోని భవనాల్లో పలు అగ్నిప్రమాద ఘటనలపై బీఆర్కే భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చి వేత, ఫైర్ సేఫ్టీ లేని భవనాలను గుర్తింపు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు , సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణలపై చర్చించారు.
డెక్కన్ మాల్ లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ముగ్గురు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతే కాకుండా అగ్నిమాపక శాఖకు భారీగా నిధుల కేటాయించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లోనే అధికంగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలని కూడా నిర్ణయించారు. భాగ్యనగరంతోపాటు శివారు కార్పొరేషన్లో అగ్నిమాపక సెల్ఫ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అమలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.