బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై తలసాని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో భావన నిర్మాణదారులపై ఫిర్యాదులు చేస్తూ.. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు.
మా పార్టీకి చెందిన నాయకులైన, ఇంకెవరైన ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వారిని జైలులో వెయిస్తామన్నారు. అధికారులు ఇలాంటి వారితో సన్నిహిత్యంగా మెలిగితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాక్నవాడి నాలా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.1 కోటి 27 లక్షల నిధులు కేటాయించామన్నారు.
ఈ ప్రాంతంలో హేవి లోడ్ తో వెహికల్స్ తిరగడం వల్ల నాలా రోడ్డు కుంగిపోయిందని చెప్పారు. ఈ లో హేవి వెహికల్స్ తిరగకుండా కమాన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
వారికి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని అన్నారు. వ్యాపారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని తెలిపారు. భావన నిర్మాణదారులను బ్లాక్ మెయిల్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.