టీఎస్ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్ లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారన్నారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికును టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు.
సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చిందన్నారు. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయన్నారు. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగినట్లు తెలిపారు. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయన్నారు. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగిందన్నారు.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ ఛార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బోయిన్పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతోనే పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్.