టీఎస్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలిపింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో మాల ధారణతో స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్తుంటారు.భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ రాయితీతో బస్సులను టీఎస్ ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని స్వాములు శబరిమల యాత్రకి సురక్షితంగా వెళ్లి రావడానికి అనుకూలంగా టీఎస్ ఆర్టీసీ సంస్థ భక్తుల కోసం కొంత రాయితీపై ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు.
అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, 02 వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితమన్నారు.
టీఎస్ ఆర్టీసీ వారి ప్రత్యేక బస్సులలో ఆడియో, వీడియో తోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించ వలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపబడునని చెప్పారు. భక్తుల కోసం అందుబాటులో ఉన్న డిపోలలో అవసరమైన బస్సులు కలవని ఆయన చెప్పారు.
టీఎస్ఆర్టీసీ బస్సులలో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు www.tsrtconline.in సందర్శించండి. అడ్వాన్స్ బుకింగ్ పై 10శాతం రాయితీ పొందండన్నారు.సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కొరకు టీఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించగలరని సూచించారు.