ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే వారికి టీఎస్ఆర్టీసీ టికెట్ లో ఐదు శాతం రాయితీ కల్పించింది. అలాగే 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్ లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ సౌకర్యాన్ని ఈ ఏడాది జూన్ వరకు కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
అందులోనూ రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్.
టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలన్నారు. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు.