తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలను వైవీ వెల్లడించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే అవకాశం కల్పించనున్నారు 2021-22 సంవత్సరానికి 2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి 9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి ధరలు పెరుగుతుండటంతో నిల్వ సామర్థ్యం పెంచాలని సూచించారు.
అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇక నుండి శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని బోర్డులో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. తిరుచానూరు ఆలయ తులాభారం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభిస్తామన్నారు.