మయన్మార్ సరిహద్దులో పట్టుబడ్డ తలనీలాల అంశం శ్రీవారి భక్తుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే తలనీలాలు… ఇలా పక్కదారి పడుతున్నాయా అంటూ భక్తులంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ఈ మొత్తం ఇష్యూపై టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి స్పందించారు.
టీటీడీ తలనీలాలపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని… ప్రపంచంలోని హిందువులందరూ తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారన్నారు. టీటీడీపై అనవసర ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. మయన్మార్ సరిహద్దులో దొరికిన తలనీలాల సీజ్డ్ రిపోర్టులో టీటీడీ పేరు లేదని, 18.17 లక్షల అన్ ప్రాసెస్డ్ హెయిర్ ను పట్టుకున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారని వివరించారు. టీటీడీలో ప్రాసెస్ చేయకుండా తలనీలాలు విక్రయించమని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలను తిరుమల నుండి తిరుపతికి తరలిస్తామని, ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. చీప్ పాపులారిటీ కోసం కొన్ని మీడియా చానళ్లు టీటీడీ ఉద్యోగులపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుష్ప్రచారంపై టీటీడీ ఉద్యోగులు బాధపడుతున్నారని… ఆరుగురిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారని టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
మిజోరాం నుంచి మయన్మార్కు 120 బస్తాలలో ఓ వాహనం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేశాయి. ఈ తలనీలాలు తిరుమలవేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.