తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భారీగా భక్తులు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారాంతపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, నిజపాద దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పటికే ఈ సేవలకు టికెట్లను తీసుకున్న భక్తులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
ఇప్పటికే విశేష పూజ, సహస్రకలషాభిషేకం సేవలను శాశ్వతంగా రద్దు చేసిన టీటీడీ.. ఇక వేసవి రద్దీ సమయంలో భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించడానికే వారాంతపు సేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం సెలవులు ఉండటంతో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.