ప్రమాదం ఎవరికి ఎలా పొంచి ఉంటుందో తెలియదు ! ఈ భూమ్మీద మనకు నూకలు ఉంటే ఏ ప్రమాదం నుంచైనా బతికిబట్టకడతాం. చెల్లిపోతే అనంత లోకాలకు వెళ్ళిపోతాం. పాపం ఆ రైల్వే ఉద్యోగి ప్రమాదం అంచులకు చేరుకుని ప్రాణాలతో బైటపడ్డాడు. విషయం ఏంటో తెలిస్తే మీరూ షాకవుతారు.
అదేంటంటే గూడు కోసం ఒక పక్షి తీసుకెళ్తున్న పొడవైన వైర్, రైల్వే స్టేషన్లోని హైవోల్టేజీ విద్యుత్ లైన్కు తగిలింది. ప్లాట్ఫామ్ అంచున నిల్చొని ఉన్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి ఆ వైర్ రెండో కొన తాకింది. దీంతో ఆ టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్ఫామ్ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కన పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
అయితే అదృష్టవశాత్తూ ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పింది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఆ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ అంచున నిల్చొన్న టీటీఈ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక విద్యుత్ వైర్ ఆయనకు తగిలింది. దీంతో ఆయన విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ప్లాట్ఫామ్ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కగా వెనక్కి పడ్డాడు.
A freak accident – a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment – at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF
— Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022
కాగా, ఆ సమయంలో ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్న కొందరు ఈ సంఘటన చూసి భయాందోళన చెందారు. తొలుత ఏం జరిగిందో అన్నది ఎవరికీ అర్థం కాలేదు. తేరుకున్న తర్వాత స్పందించారు. విద్యుదాఘాతానికి గురై రైల్వే ట్రాక్ వద్ద తలకిందులుగా పడిన టీటీఈని లేపి ఫ్లామ్ఫామ్పైకి తెచ్చారు. ఆ వెంటనే స్ట్రెచ్చర్పై పడుకోపెట్టి ఆసుపత్రికి తరలించారు.
మొత్తానికి ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. విద్యుదాఘాతం వల్ల ఆయనకు కాలిన గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, ఆ రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.