ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వంలో మార్చాల్సింది మంత్రులను కాదని, ముఖ్యమంత్రినే మార్చాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, ఆరవ వేలుతో సమానమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యల్లా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేనని మండిపడ్డారు తులసి రెడ్డి.
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్ర ప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, అసమర్ధ ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్ర ప్రదేశ్ మార్చారని, వీటన్నిటికీ మూల కారకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. జగన్ ని మారిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని తులసిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ కంటే సమర్థంగా పరిపాలించే వాళ్లు అనేక మంది ఆయన పార్టీలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడమంటే.. చేతగాని వైద్యుడు పంటినొప్పికి బదులు తుంటి మీద తన్నినట్లేనని సెటైర్ వేశారు తులసి రెడ్డి.