తెలంగాణలో మరో బ్యారేజీకి పేరు మార్చారు సీఎం కేసీఆర్, ఇప్పటికే పలు బ్యారేజీలకు దేవతల పేర్లు పెట్టిన సీఎం మరో బ్యారేజీకి తెలంగాణ వన దేవత సమ్మక్క పేరు ను పెడుతున్నట్లు ప్రకటించారు. గోదావరి నది మీద నిర్మితమవుతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత.. ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని నిర్ణయించారు. తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్ రావు ను సీఎం ఆదేశించారు. ఆ దేవుడి కరుణాకటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతున్నదని కేసీఆర్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీల్లల్లోకి కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులను ఈరోజు సీఎం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రగతి భవన్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారినయి. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా..అటునుంచి కాలువలకు మల్లించే దిశగా.. ఇర్రిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి’’..అని అధికారులకు సూచించారు. అందులో భాగంగా పనుల విభజన చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.