అమెరికాలో ఖమ్మం జిల్లా వాసి అఖిల్ శ్రావిక్ సాయి మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్ల అతను మరణించలేదని తేలింది. తోటి విద్యార్థే అతన్ని కాల్చి చంపాడని తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ విద్యార్థికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అఖిల్ సాయిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది? వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొదట తుపాకి మిస్ ఫైర్ కావడంతో అఖిల్ సాయికి గాయాలయ్యాయని అతని తల్లి దండ్రులకు సమాచారం అందింది. ఆ తర్వాత అతను చనిపోయాడని, ఇప్పుడు తోటి విద్యార్థి అతనిపై కాల్పులు జరిపారని చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
అమెరికాలోని అలభామ సిటీలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ అయిందని అఖిల్ సాయి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఘటనలో అఖిల్ సాయి తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందించింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఫోన్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. . సాయి తల్లిదండ్రులు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. కాగా.. చేతికొచ్చిన కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అఖిల్ సాయి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర. అఖిల్ అమెరికాలో అభర్న్ యూనివర్సిటీ లో ఎమ్మెస్ చదివేందుకు ఏడాది క్రితం అమెరికా వెళ్లాడు. అఖిల్ సాయి మరణంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తన కుమారుడి మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు విఙ్ఞప్తి చేస్తున్నారు.