టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్య ట్విట్టర్ లో యుద్ధం నడుస్తోంది. దీక్షా దివస్ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీక్షా దివస్ సందర్భంగా మొదట కవిత నిన్న ఓ ట్వీట్ చేసింది.
కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు… నవంబర్ 29, దీక్షా దివాస్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ఇది దీక్ష దివాస్ కాదు దగా దివాస్ అంటూ మండిపడింది. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం అంటు పేర్కొంది. దొంగ దీక్ష నాటకమాడిన మీ తండ్రి సీఎం కుర్చీ ఎక్కిండని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిత్తశుద్ధితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన తెలంగాణ బిడ్డలకు కనీసం గుర్తింపే లేదంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కవితను ట్యాగ్ చేస్తూ ఉద్యమ ద్రోహి కేసీఆర్ అంటూ ఓ యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పెట్టింది. దీంతో కాంగ్రెస్ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డా అని ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్సే కారణమంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గారని, రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపనతోనే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని చెప్పారు.
ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ను దేశ వ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తున్నారని అయినా బుద్ధి రావడం లేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రజా ఉద్యమం ప్రారంభించారని, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారని చెప్పారు.
కవిత ట్వీట్లపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే, బతుకమ్మ ఆడినందుకే, బోనం కుండలు ఎత్తినందుకే మీ ఇంటిల్లి పాదికి సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అంటూ ప్రశ్నించారు. అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించారని, మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అంటూ ఫైర్ అయ్యారు. దీంతో దీక్షా దివస్ సందర్భంగా ఇరువురి మధ్య వార్ నడిచింది.