తెలంగాణలో మరోసారి రాజకీయాలు వెడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పక్కరాష్ట్రాలపై, కేంద్రంపై ట్విట్లు పెట్టి వివాదాలు రేపిన కేటీఆర్.. సోమవారం మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు.
దేశంలో ఏడేళ్ల బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చేనిధుల కొరత.. అన్నింటిలో కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా పీఎం మోడీకి విజన్ లేకపోవడమేనంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చేసిన ట్వీట్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి దీటుగా బదులిచ్చారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలన వైఫల్యాలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు, రుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేదు, ఋణమాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, పంటనష్ట పరిహారం లేదు, దళితబంధు లేదు అని ట్వీట్ చేశారు.
బీసీబంధు అసలే లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు, అప్పులకు కొదవ లేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల కొరత ఎక్కువైంది, సామాజిక న్యాయం లేదు, సచివాలయం లేదు, సీఎం ప్రజలను కలిసేది లేదు, ఉద్యమ కారులకు గౌరవం లేదు, విమోచన దినోత్సవం జరిపేది లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు.. అంటూ విమర్శలు చేశారు కిషన్ రెడ్డి.