బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయింది. రూ. రెండున్నర కోట్ల రుణం తీసుకొని బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ కారణంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
2018 బిజినెస్ కార్యకలపాల కోసమంటూ సోమాజిగూడలోని ఎస్బీఐ బ్రాంచీని రుణం కోసం సంప్రదించారు. పటాన్ చెరువు గౌతంనగర్ ఆశిష్ గౌడకు చెందిన 460 గజాల స్థలంలో ఉన్న ఇంటిని మార్టిగేజ్ పెట్టి రూ. 2.50 కోట్ల రుణం తీసుకున్నాడు.
అయితే.. రుణం చెల్లింపులో అవకతవకలకు పాల్పడటంతో రెండేళ్ళ క్రితం రుణం చెల్లించాలంటూ బ్యాంకు శివంతా ఫార్మా సుమంత్, ఆశిష్ గౌడకు నోటీసులు జారీ చశారు. వారు స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు తనఖా పెట్టిన పత్రాల ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా షాక్ కు గురయ్యారు.
ఆ ఇంట్లోని ఫ్లాట్లను వేరొకరికి ఫోర్జరీ పత్రాలతో విక్రయించినట్లు తేలింది. ఇంటి పత్రాలు బ్యాంకు ఆధీనంలో ఉండగానే కుట్రపూరితంగా ఇంటిని అమ్మేయడం ద్వారా బ్యాంకుకు టోకరా వేసినట్లు గుర్తించిన ఎస్బీఐ సోమాజిగూడ బ్రాంచీ చీఫ్ మేనేజర్ రాజుల సతీష్ కుమార్ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.