అహంకారంతో కారుణ్యాన్ని మర్చిపోయి పశువుల కంటే హీనంగా ప్రవర్తించినందుకు ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు.బతికున్నవీధికుక్కకు తాడుకట్టి ఈడ్చుకెళ్తూ హింసించినందుకు నలుగురితో చీవాట్లు తినడమే కాకుండా పోలీసు కేసుకూడా ఎదుర్కున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. అనంతరం సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవేశంతో అనాలోచితంగా చేసిన పనికి చెంపపెట్టుగా వారికి చట్టపరంగా శిక్షించేలా చేయడంతో ఈ ఘటన అందరికీ కనువిప్పు కలిగేలా చేసింది.
పరిగి మున్సిపల్ పరిధిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వీధి శునకాన్ని తాడుతో కట్టి, బైకుకు కట్టి లాకెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శునకాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్ళే దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారికి చేరింది.
ఈనేపథ్యంలోశునకంపై కౄరత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫౌండేషన్ సభ్యులు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ తో కుక్కను లాకెళ్ళిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. వెటర్నరీ సిబ్బంది సహాయంతో డంపింగ్ యార్డులో గాయపడి ఉన్న కుక్కను గుర్తించి స్థానిక పశు వైద్యశాలలో చికిత్స అందించారు. రోడ్డుపై నుంచి అమానుషంగా ప్రవర్తించడంతో కుక్కకు తీవ్ర గాయాలయ్యాయని పశు వైద్యుడు తెలిపారు.
వీధిలో స్వైర విహారం చేస్తూ తమ పిల్లలను కరవడమే కాకుండా పశువులపై దాడి చేయడం వల్ల ఆవేశంతో చేశామని, అనాలోచితంగా చేసిన పని వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆ వ్యక్తులు పశ్చాత్తాపపడ్డారు. మూగ జీవులపై కౄరత్వం ప్రదర్శించడం తప్పని, వీధి కుక్కల వల్ల ఇబ్బందులు తలెత్తితే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సూచించింది. మూగ జీవులను హింసించడం చటరిత్యా నేరమని….ఇలాంటి పనులకు పాల్పడితే ఎంతటివారైనా శిక్షార్హులేనని స్పష్టం చేశారు.
మనిషిలాగే ఈ భూమ్మీద పుట్టిన ప్రతీజంతువుకీ బ్రతికే హక్కుంది. వెనక్కు వెళితే మనిషి కూడా జంతువే.తెలివిమీరిన జంతువు. మాట నేర్చిన జంతువు.కష్టాలను నెట్టుకుని, చీకట్లను చీల్చుకుని తనని తాను మలచుకున్నాడు. మనిషిగా మార్చుకున్నాడు. అయితే అది మర్చిపోయి మళ్ళీవెనక్కెళ్ళ కూడదు. జంతువుగా మారకూడదు.అలా మారితే మనిషన్నవాడు ఊరుకోడు.