తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతి భవన్ లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికి కేటీఆర్ పలు వివరాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ లో ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు కేటీఆర్ తెలిపారు.
షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం డబ్బు తీసుకుని క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు కేటీఆర్. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని యూఏఈ రాయబారి తెలిపారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయ్ లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కేటీఆర్ కోరారు.