హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. 4వ ఫ్లోర్ కి సెంట్రింగ్ పనులు చేస్తుండగా మూడో అంతస్థు శ్లాబ్ ఒక్కసారిగా కిందికి కూలిపోయింది.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్ కూలడంతో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కూలీలను బయటకు తీయగా.. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు కూలీలు శిథిలాల కిందనే ఉన్నట్టు తెలుస్తోంది.
కూకట్ పల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసు పక్కనే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్న తొందరే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
నాసిరకం పనులే ప్రధాన కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.