కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం ఉదయం జరిగిన 74వ ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్కు అమిత్ షా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ను సమీక్షించారు.
అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ.. జాతీయ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎన్ఐఏ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని అన్నారు. ఎన్ఐఏ, ఎన్సీబీ విస్తరణ మాదక ద్రవ్యాలు, తీవ్రవాదంలో పాల్గొన్న నేరస్థులను నియంత్రించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన నేరాలను జాతీయ డేటాబేస్లో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇటీవల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించడం ద్వారా ప్రపంచం చూడడానికి తాము ఒక విజయవంతమైన ఉదాహరణను అందించామని అమిత్ షా చెప్పారు. భారత ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నాయకత్వంలో.. మొత్తం దేశంలోని పోలీసు బలగాలు పీఎఫ్ఐ వంటి సంస్థపై ఒకే రోజులో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించి విజయం సాధించాయని తెలిపారు. అంతర్గత భద్రతలో గత ఏడు దశాబ్దాలుగా.. తాము అనేక హెచ్చు తగ్గులు, అనేక సవాలు సమయాలను చూశామని చెప్పారు. అటువంటి సమయాల్లో 36,000 మందికి పైగా పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు.
74 ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) బ్యాచ్కి చెందిన 33 మంది మహిళలతో సహా 166 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు దీక్షాంత్ పరేడ్లో(పాసింగ్ ఔట్ పరేడ్) పాల్గొన్నారు. పరేడ్లో నలుగురు మహిళలతో సహా పొరుగు దేశాల నుంచి 29 మంది విదేశీ అధికారులు కూడా భాగమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అమిత్ షా రోడ్డు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
ఇక, ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్కు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకున్న అమిత్ షా.. రాత్రికి అక్కడే బస చేశారు.