కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదివాసీల ఆరాద్య దైవం నాగోబాను దర్శించుకునేందుకు అర్జున్ ముండా రానున్నారు. ఆదివారం ఉదయం 10:45 గంటలకు హెలికాప్టర్ లో అర్జున్ ముండాతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేస్లాపూర్ చేరుకోనున్నారు.
ఉదయం 11:00 గంటలకు నాగోబాను దర్శించుకొని మెస్రం వంశీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడతారు. అనంతరం జాతరను సందర్శించి ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు అర్జున్ ముండా, బండి సంజయ్. తరువాత స్థానిక నాగోబా దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా పాల్గొననున్నారు. ఆపై తిరిగి కేస్లాపూర్ నుండి హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రితో పాటు ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేస్లాపూర్ లో ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్ ను పోలిస్ ఉన్నతాధికారులు పరిశీలించి కేంద్ర మంత్రి రానున్న క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈనెల 21న ప్రారంభమయ్యే ఆదివాసిల నాగోబా జాతర సందర్భంగా 22వ తేదీన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ తెలిపారు.
నాగోబా జాతర ఈనెల 21న అర్థరాత్రి మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. కావున జాతరకు వేలాది సంఖ్యలో ఆదివాసీలు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. జాతరకు అన్ని విధాల ఏర్పాట్లు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానున్న తరుణంలో ఆదివాసిలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రిని ఆహ్వానించి స్వాగతం పలకాలని మెస్రం వంశీయులు కోరారు.