ఆదివారం రాత్రి మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని లియోనియా రిసార్టులో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించునున్న ఫోర్తు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ యూత్ సమ్మిట్ ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీ 20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోందని.. ఆసియా దేశాల్లో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఇలాంటి సమ్మేళనాలు దోహదపడతాయన్నారు.ఇండో ఏసియన్ రీజియన్ లో శాంతికి ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఈ వేదికతో ఈశాన్య దేశాల ప్రతినిధులు ఆయా దేశాల మధ్య వారధులుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రాంతాల మధ్య వ్యూహాత్మకంగా చర్చలు జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాలు సైతం రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాలను అనుసరిస్తున్నాయన్నారు. ఈ యువ సమ్మేళనానికి ఫిలిప్పీన్స్, సింగపూర్, బ్రూనై, దారుసలాం, కొలంబియా, ఇండోనేసియా, లావ్ పీపుల్స్ డెమొక్రటిక్ రిపబ్లిక్, మలేసియా, మయన్మార్, థాయ్లాండ్, వియత్నాం దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
భారత్ తరుఫున 40 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అనంతరం వివిధ దేశాల కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి రామ్ మాధవ్, ఫౌండేషన్ డైరెక్టర్ మేజర్ జనరల్ ధ్రువ్ సీ కొటాచ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.