సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం అగ్ని ప్రమాదానికి గత కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందారు.
హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. గోదాములు, తుక్కు వంటి దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేయట్లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
అగ్ని మాపక సిబ్బందికి కావాల్సిన కొత్త పరికాలను అందించాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదాములను శివారు ప్రాంతాలకు తరలించాలని అన్నారు. తమ వద్ద సిబ్బంది తక్కువగా ఉన్నట్లు అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
భవన యజమానుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తే అలాంటి వారిపై కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.