కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వాలంటూ, అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ తో ఆడుకున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంత కలెక్టర్ వినూత్న శిక్షను విధించారు. ఆ తరువాత జరిగిన మొత్తం ఉదంతాన్ని సోషల్ మీడియాలో ఉంచగా, అదిప్పుడు వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో కరోనా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి, తనకు నాలుగు సమోసాలు కావాలని కోరాడు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా, పదే పదే ఫోన్ చేసి సమోసాలు అడుగుతూనే ఉన్నాడు. దీంతో విషయం తెలుసుకున్న రాంపూర్ జిల్లా కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్, అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
సమోసాలు ఆర్డర్ చేస్తున్న ఆకతాయి ఇంటికి వాటిని తీసుకెళ్లి అందించారు. అధికారుల విధులను ఆటంకపరిచారన్న ఆరోపణలపై మరుగుదొడ్లను శుభ్రం చేయాలంటూ, సామాజిక శిక్షను విధించారు. ఈ విషయాన్ని ఆంజనేయ కుమార్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.