ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా నిన్న ఒక్కరోజే దాదాపు 25 మంది మరణించారు. జోరు వానలతో రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో వీరంతా మృతి చెందారు. కుండపోత వర్షాలతో లక్నో, అలీగఢ్, మేరఠ్, గౌతంబుద్ధ్ నగర్, గాజియాబాద్ సహా మొత్తం 12 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.
అనేక చోట్ల రహదారులు నీటమునిగాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా 12 జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ వరదల కారణంగా గోరఖ్పూర్లోని రప్తీ నదిలో పడవ మునిగి ఇద్దరు మరణించారు. ఆదివారం ఉదయం గాజియాబాద్లో ఇల్లు కూలి 90 ఏళ్ల వృద్ధురాలి ప్రాణాలు కోల్పోయింది. మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అకల్పుర్ గ్రామంలో ఇల్లు కూలి ఓ మహిళ మృతి చెందింది.
హర్దోయిలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. మరొకరు గాయపడ్డారు. సీతాపుర్ జిల్లా ఔత్రాలీ గ్రామంలో 11 ఏళ్ల బాలిక పిడుగుపాటు కారణంగా మరణించింది. ఇటావాలోని జౌన్పుర్లో 75ఏళ్ల మహిళ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయింది. బులంద్షహర్లో ఇళ్లు కూలిన మూడు వేర్వేరు ఘటనల్లో 14 ఏళ్ల బాలుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. బల్రామ్పుర్లో వరదల్లో ఇద్దరు టీనేజర్లు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు.ఇదే తరహాలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం నిన్న ఉత్తర్ప్రదేశ్లో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే రోజుకు సంబంధించిన దీర్ఘకాలిక సగటుతో పోల్చితే ఇదే 2,396 శాతం అధికం. అక్టోబర్ 1 నుంచి యూపీలో 92.3మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీర్ఘకాలిక సగటుతో పోల్చితే ఇది 500 శాతం ఎక్కువ. రాష్ట్రంలో మరో రోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.