-మొదటి నాలుగు స్థానాల్లో వారే
-నారాయణ పేట ఎస్పీ కూతురుకు 3వ ర్యాంకు
-మెరిసిన తెలుగు తేజాలు
యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్-2022 తుది ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది సివిల్స్ ఆలిండియా టాపర్గా ఇషితా కిషోర్ నిలిచారు. ఆ తర్వాత గరిమా లోహియా, ఉమా హారతి ఎన్, స్మృతి మిశ్రాలు రెండు, మూడు, నాల్గవ ర్యాంకులు సాధించారు.
దేశ వ్యాప్తంగా ఈ పరీక్షల్లో మొత్తం 933 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించింది.
చివరగా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ 99 మంది, ఓబీసీ 263 మంది, ఎస్సీ కోటాలో 154 మంది, ఎస్టీ కోటాలో 72 మంది ఎంపికయ్యారు. ఇక యూపీఎస్సీ 2022 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిసాయి.
ఈ ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు – శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమా హారతి జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించి సత్తా చాటారు. హైదరాబాద్లో ఆమె ఐఐటీ పూర్తి చేశారు. నాల్గవ ప్రయత్నంలో ఆమె విజయం సాధించారు. ఆమె సోదరుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో జాతీయస్థాయిలో 12వ ర్యాంకును సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఇక తిరుపతికి జిల్లాకు చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.