కుండ బద్దలు కొట్టడంలో ఏ బాలీవుడ్ భామైనా కంగనా తర్వాతే. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పితీరుతుంది. ట్విట్టర్ ఎకౌంట్ పునరుద్ధరింపబడి పట్టుమని పదిరోజులు కాకుండానే సరికొత్త వివాదాస్పద ట్వీట్ కి ఓటు వేసింది కంగనా రనౌత్. తాజాగా పఠాన్ మూవీ విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చిత్ర విజయాన్ని విశ్లేషిస్తూ ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేసింది. “హిందువులు, ముస్లింలూ షారుఖ్ని సమానంగా ప్రేమిస్తారు. బహిష్కరణ వివాదాలు సినిమాకి సహాయం చేస్తాయి.
రొమాన్స్, మంచి సంగీతం ఉంటే చాలు సినిమాలు ఆడతాయి. అందుకే భారత్ సెక్యులర్ దేశం’’ అని కామెంట్ పెట్టింది. ఐతే, ఆ నెటిజన్ కామెంట్స్కి కంగనా తనదైన శైలిలో స్పందించింది. ‘చాలా మంచి విశ్లేషణ. ఈ దేశం చాలా సందర్భాలలో కేవలం ఖాన్లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం హీరోయిన్లంటే మక్కువ చూపిస్తుంది. కాబట్టి, ఈ దేశంలో ద్వేషం, పాసిజం ఉందని నిందలు వేయడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్ లాంటి దేశం ఇంకోటి లేదంటూ” కంగనా ట్వీట్ చేసింది.
కంగనా చేసిన ట్వీట్ పై బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ సంచలన విమర్శలు చేసింది. “ఏంటిది! ఈ ముస్లిం నటులు, హిందు నటులు ఏంటి? కళని మతాన్ని బట్టి వేరు చేయొద్దు. ఇక్కడ కేవలం నటులు మాత్రమే ఉంటారని తన ఇన్ స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కంగనా ట్వీట్ని జీర్ణించుకోడం కష్టంగా ఉందని తెలిపింది. తాను ముస్లిం కాదని.. కాబట్టి తన సినిమాలని చూడమని ఉర్ఫీ జావేద్ చెప్పింది.