అమెరికా వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఇక నుంచి అది మరింత ఖరీదైన కలగా మారనుంది. తాజాగా ఇమ్మిగ్రేషన్ ఫీజులను భారీగా పెంచేందుకు బైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. తాజాగా చేసిన ప్రతిపాదన నేపథ్యంలో హెచ్-1బీ సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత పెరగనున్నాయి.
ఈ మేరకు వివరాలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం తన అధికారిక వెబ్సైట్లో అప్ లోడ్ చేసింది. ఆ వివరాల ప్రకారం.. హెచ్-1బీ వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. ఎల్-1 వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు పెంచాలని ప్రతిపాదనలు చేసింది.
O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని భావిస్తున్నారు. ఇక, హెచ్-2బీ వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను వెబ్ సైట్ లో 60 రోజుల పాటు ఉంచనున్నారు. దీనిపై వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు.
ఆ తర్వాత కొత్త ధరలను అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఖర్చు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఫీజులను పెంచినట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది. అంతేగాక, తాజా నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశముందని తెలిపింది.
ఈ ఏజెన్సీకి 96శాతం నిధులు, వీసా దరఖాస్తు ఫీజుల ద్వారానే వస్తున్నాయి. 2020లో కరోనా నేపథ్యంలో వీసా దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఏజెన్సీ ఆదాయం 40శాతానికి పైగా పడిపోయింది. నిధుల లేమి కారణంగా ఏజెన్సీలో నియామకాలు కూడా నిలిచిపోయాయి. సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించారు. దీంతో పెండింగ్ వీసా దరఖాస్తులు పెరిగాయి.