ఉత్తరేణి మొక్క.. దీని గురించి చాలామందికి తెలియదు. ఇది ఎన్నోఔషధ గుణాలు కలిగిన సంజీవని. మన చుట్టుపక్కలే ఉన్నప్పటికీ దీనిని పిచ్చి మొక్కగా భావించి పీకి పారేస్తుంటాం. ఆయుర్వేద గ్రంథాలలో దీని గురించి వివరణ ఇచ్చారు మన పూర్వీకులు. దాని ఉపయోగాలు తెలియక ఎంతో నష్టపోతున్నాం. దీని రసం చేదుగా ఉన్నా.. దీనిని తాగడం వలన మనకు వచ్చే వాత, కఫ, పిత్త సంబంధిత సమస్యలను పూర్తిగా నయం చేస్తుంది.
ఉత్తరేణి మొక్కను సంస్కృతంలో అపమార్క, మయూరక, కరమంజరి అనే పేర్లతో పిలుస్తారు. దీని గింజలను తీసుకుని పొడిగా చేసి 100 గ్రాముల చొప్పున తీసుకుని దానికి 10 గ్రాముల ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిప్పి పళ్ల సమస్య కూడా తగ్గుతుంది. ఉత్తరేణి ఆకులను మిరియాలను వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి నూరి చిన్న మాత్రల పరిమాణంలో చేసి నీడకు ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు పూటకు రెండు చొప్పున ఈ మాత్రలను తీసుకుంటూ ఉండడం వల్ల జ్వరం తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు.
ఉత్తరేణి ఆకుల పొడి లేదా వేరు పొడిని నిప్పుల మీద వేసి వచ్చే పొగను పీల్చడం వల్ల దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క మొత్తాన్ని తీసుకుని ఎండబెట్టి కాల్చి బూడిదగా చేయాలి. ఈ బూడిదకు రెట్టింపు చక్కెరను కలిపి రెండు పూటలా 3 గ్రాముల చొప్పున తీసుకుంటే గొంతు, ఉపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఆయాసం, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా దీని పచ్చి గింజలను నూరి వడకట్టి ప్రతి రోజూ ఉదయం పొరగడుపున ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మూత్రాశయంలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఉత్తరేణి మొక్క పచ్చి ఆకులు ఏడింటిని తీసుకుని వీటికి ఏడు మిరియాలను కలిపి నూరి తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎర్ర ఉత్తరేణి ఆకుల రసాన్ని 50 గ్రాముల చొప్పున తీసుకుని దానికి 50 గ్రాముల ఆవు నెయ్యిని కలిపి తీసకోవడం వల్ల రక్త మొలల సమస్య తగ్గుతుంది. ఉత్తరేణి ఆకులు, సహదేవి చెట్టు వేరు మిరియాలను సమపాళ్లల్లో కలిపి నూరి మిరియాల గింజలంత పరిమాణంలో మాత్రలుగా చేసి నీడకు ఎండబెట్టి తల్లిపాలతో కలిపి పిల్లలకు నాకిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్క ఆకులను, వేర్లను సమపాళ్లలో తీసుకుని పొడిగా చేసి దానికి సమపాళ్లలో పటిక బెల్లం పొడిని కలిపి పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండటం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. కాలేయం, ప్లీహం కూడా శుభ్రంగా మారతాయి. శరీరంలో మంచి రక్తం పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఉత్తరేణి వలన అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.