రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ను ఇటీవలే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కలిసిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ పంత్.. ప్రస్తుతం చికిత్స పొందుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
శస్త్ర చికిత్స అనంతరం బెడ్ కే పరిమితమైన పంత్ ఆ తర్వాత కొద్ది కొద్దిగా కోలుకోవడం ప్రారంభించాడు. స్టిక్ సహాయంతో ఇప్పుడిప్పుడే నడవడం కూడా మొదలుపెట్టాడు. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు.
అయితే తాజాగా పంత్ ను.. మాజీ క్రికెటర్ యువ్ రాజ్ సింగ్ కలిశాడు. ఈ క్రమంలో పంత్ ను పరామర్శించిన యువీ.. అతడితో కాసేపు ముచ్చటించాడు. “ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఛాంపియన్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు..” అంటూ రిషభ్ పంత్ తో దిగిన లేటెస్ట్ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఆత్మవిశ్వాసాన్ని చూసి మురిసిపోయిన యువీ.. పంత్ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, నెగిటివ్ ఆలోచనలు దరిచేరనీయడంటూ కొనియాడాడు.
త్వరగా కోలుకొని తిరిగి మునపటిలా మారాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే పంత్ తన అభిమానుల కోసం వాకింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. తాజాగా మరో వీడియోను కూడా షేర్ చేశాడు. దాని కింద ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. అందులో నిండా నీళ్ళు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించాడు.