శివుడు పరమయోగి. భక్తులకు కొంగుబంగారమేమో గానీ తాను మాత్రం శరీరమంతా భస్మం పూసుకుని స్మశానాల్లో తిరుగుతాడు. ఎంత సంపాదించినా..భవబంధాలు తెంచుకుని బూడిదకావాల్సిందేననే కఠోరసత్యాన్ని బోధిస్తాడు.ఆడంబరాలకు ఆమడ దూరం ఉండే శివుడికి 111 అడుగుల ఎత్తైన బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు భక్తులు. ఏళ్ల నాటి స్వర్ణ సంకల్పాన్ని ఈ శివరాత్రి నాటికి పూర్తి చేశారు. గుజరాత్లోని వడోదరలో సుర్సాగర్ సరస్సు మధ్యలో కొలువైందీ భారీ శివమూర్తి.
మంజల్పూర్ ఎమ్మెల్యే యోగేశ్పటేల్ ఆధ్వర్యంలోని సత్యం శివం సుందరం సమితి ట్రస్ట్ తీసుకున్న శివసంకల్పమిది. ఏళ్లనాటి ఆ సంకల్పం సరిగ్గా ఈ శివరాత్రి నాటికి పూర్తయ్యింది. 1996లో మొదలైన ఈ విగ్రహ నిర్మాణం 2002లో పూర్తయ్యింది.
అయితే, అప్పుడు కేవలం రాగితో ఏర్పాటయినా… ఆవిష్కరణ మాత్రం జరగలేదు. 2012లో ఈ మహామూర్తిని జాతికి అంకితం చేసిన ఇన్నేళ్ల తర్వాత ఈ విగ్రహానికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్ సంకల్పించింది. మొదట్లో అది సాధ్యం కాదునుకున్నా భక్తుల సహకారంతో ఇలా కార్యరూపం దాల్చింది.
ఈ భారీ విగ్రహానికి బంగారుపూత అంటే మామూలు విషయం కాదుగా. మొత్తంగా, 17.5 కేజీల బంగారం, దానికోసం 12కోట్ల రూపాయల వ్యయం అవసరమవుతుందని తేల్చారు. అయితే, విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు, ఎన్నారైలు ముందుకు రావడంతో మహత్కార్యం ముందుకు సాగింది. దీంతో అనుకున్న సమయానికి.. స్వర్ణ సంకల్పం నెరవేరింది.
ఈ మహాశివుడి మహా మూర్తిని చూసి భక్తజనులు ఉప్పొంగిపోతున్నారు. సరస్సు నడిమధ్యన వెలిసిన ఈ బంగారు శివస్వరూపం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుండటంతో వావ్ అంటున్నారు భక్త నెటిజన్లు.
హర్ హర్ మహాదేవ్ శంభోశంకర అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. కొందరైతే శివరాత్రి సందర్భంగా స్వర్ణమూర్తిని దర్శించుకునేందుకు రూట్మ్యాప్ రెడీ చేసేసుకుంటున్నారు.
Gold plated Shiva Statue at Sursagar lake Vadodara. pic.twitter.com/DYKRRey8UE
— Sunita Rathva (@RathvaS7) February 17, 2023