రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఈ మేరకు వాలంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించాయి. అనంతరం వీహెచ్పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ మాట్లాడారు.
‘వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్పీ నిర్ణయించింది. ప్రజలంతా అమర జవాన్లకు నివాళులు అర్పించాలి.
దేశం కోసం పని చేస్తున్న వీర జవాన్లను స్మరించుకోవాలి. ఎవరైనా వాలంటైన్స్ డే జరుపుకొంటే కచ్చితంగా అడ్డుకుంటాం’’ అని పండరినాథ్ మాట్లాడారు. భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామ్ మాట్లాడుతూ ‘‘మా సంస్థల ఆధ్వర్యంలో బ్యాన్ వాలంటైన్స్ డే కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధిస్తున్నాం.
పబ్బులు, హోటళ్లు, పార్కులలో ఎవరైనా ప్రేమికుల రోజు కనిపిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డుల దహనం ఉంటుంది. ఫిబ్రవరి 14న అమర జవాన్లను స్మరించుకుని నివాళులు అర్పిద్దాం. దేశభక్తిని చాటుదాం’’ అని అన్నారు.